Friday, December 8, 2023

కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన 6 గ్యారంటీల అమలుకు సలహాలు, సూచనలు

 ఏ ప్రభుత్వమైనా, ప్రజల ఆలోచనలను, సూచనలను, సలహాలను తీసుకుంటూ, పరిపాలన సాగిస్తేనే, ప్రభుత్వం పది కాలాల పాటు ఫరిడవిల్లు తుంది. అలానే నాయకులు చరిత్రలో, ప్రజలు గుండెల్లో స్థిర స్థాయిగా నిలిచి పోతారు .


రాష్ట్రం అప్పుల పాలు కాకుండా, మిగులు నిధులుతో రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే, అన్ని వర్గాల , అన్ని ప్రాంతాల ప్రజలు, అన్ని వయస్సుల వారు సంతోషంగా జీవిస్తూ, అభివృద్ధి పథంలో ముందుకు సాగాలంటే, పాలకులు
ప్రజల సలహాలు, సూచనలు  తప్పక పరిశీలనకు తీసుకుంటారని ఆశిస్తున్నాం.

నేడు జీవన వ్యయం అనూహ్యంగా పెరిగింది కాబట్టి, అర్బన్ ఏరియాలో నివసించే వారి వార్షిక ఆదాయం 5 లక్షల లోపు ఉన్న వారిని, అదే రూరల్ ఏరియాలో నివసించే వారి వార్షిక ఆదాయం 3 లక్షల లోపు ఉన్న వారిని  ఈ 6 గ్యారంటీ పథకాలకు అర్హులుగా పరిగణించాలి. అలాగే తప్పకుండా  ఈ 6 గ్యారంటీలను అమలు చేయాలి.
అలానే 5 నుండి 10 లక్షల లోపు  వార్షికాదాయం ఉన్న వారిని మధ్యతరగతి గాను  పరిగణించాలి.

అర్హులైన వారికి ఈ 6 గ్యారంటీలను అమలు చేయడం సాధ్యమా అంటే , ఖచ్చితంగా సాధ్యమే.
ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేసి, అవినీతి సొమ్మును రికవరీ చేస్తూ, భూకబ్జాలను తిరిగి రాబట్ట గలుగుతే, భూసీలింగ్ లను అమలు చేసినట్లయితే, అవినీతి  పథకాలను అరికట్టి నట్లయితే, తక్షణమే ధరణి పోర్టల్ ప్రక్షాళన చేపడితే ఈ 6 గ్యారంటీలు కచ్చితంగా సాధ్యమవుతాయి. సులభంగా అమలు జరుగుతాయి కూడా.

01. మహాలక్ష్మి పథకం ద్వారా, అర్హులైన మహిళలకే,  ప్రతినెలా 2500 రూ.లు ఇవ్వాలి. ఆదాయ పన్నులు కట్టే వారికి, కార్లు, లారీలు, బస్సులు ఉన్న కుటుంబాల మహిళలకు వర్తింప చేయకూడదు. ప్రతి కుటుంబానికి 500 రూ.లకే గ్యాస్ సిలిండర్ తప్పక ఇవ్వాలి, మహిళలకు తెలంగాణా అంతటా ఆర్టీసి బస్సులలో ఉచిత ప్రయాణం అమలు చేయాలి. అయితే చాలా బస్సు రవాణా సౌకర్యాలు లేవు. అలాంటి రేట్లను గుర్తించి బస్సులను నడుపాలి. ఇప్పటి వరకు ఆయా రూట్లలో, ఆటోలు, క్యాబ్ లో పైన ఆధారపడాల్సి వస్తున్నది. మరో విషయం, ఉచిత ప్రయాణం కాబట్టి మహిళలు ఎక్కువగా ప్రయాణం చేయడం జరుగుతుంది. కాబట్టి, రద్దీ ఉన్న రూట్లను గుర్తించి, మహిళలకు సెపరేట్ బస్సులను వేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించడం వలన విద్యార్థినులకు, చిరు ఉద్యోగ మహిళలకు చాలా మేలు చేకూరుస్తుంది. ఆర్ధిక భరోసా నిస్తుంది. మహిళలకు ఉచితం అనేసరికి , వారి ఫ్యామిలీ తో కూడా వస్తారు కాబట్టి, బస్సుల్లో రద్దీ పెరుగుతుంది. ఆ విధంగా ఆర్టీసీ లాభాల బాట పడుతుంది.
02. రైతు భరోసా పథకం ద్వారా, ప్రస్తుతం ఉన్నటువంటి, రైతుల రుణాలను పూర్తిగా మాఫీ చేయాలి. ఆ తర్వాత 10 ఎకరాల లోపు మాగాణి భూమి ఉన్నవారికి, 15 ఎకరాల లోపు మెట్ట భూమి ఉన్న వారికి మాత్రమే రైతు రుణమాఫీ వర్తింప చేయాలి.
03. అలానే రైతు బంధు పథకం 10 ఎకరాల లోపు మాగాణి భూమి, 15 ఎకరాల లోపు మెట్ట భూమి ఉన్న వారికే వర్తింప చేయాలి. మైనింగ్ భూములకు, గుట్టలకు, కాలేజీల భూములకు, బీడు భూములకు, భూస్వాములకు రైతు బంధు పథకం, రుణమాఫీ వర్తింప జేయకూడదు.  ఇక పోతే,
భూమిని సాగు చేసేది, భూమిని అభివృద్ధి చేసేది , రైతుల భూమిని కాపాడేది , రేయింబవళ్ళు కష్టపడేది, పంట పండినా, పండక పోయినా, గిట్టుబాటు ధర దొరకక పోయినా భరించేది , పంటలను పండించేది కౌలు దారులు కాబట్టి , కౌలు దారులకు సం.రానికి 15000 రూ.లు (రెండు దఫాలుగా)  ఇవ్వాలి.
ఒక వేళ రైతులే పంటలు పండిస్తే, రైతులకే రైతు బంధు , రుణమాఫీ వర్తింప చేయాలి.
04. అలానే మీరు ఇచ్చిన గ్యారంటీల ప్రకారం వ్యవసాయ కూలీలకు సం. రానికి 12000 రూ.లు ఇవ్వాలి . కూలీలు అంటే రైతు బంధు రాని వారు మాత్రమే కూలీలు. కూలీలకు ప్రత్యేక కార్డులను జారీ చేయాలి. , ప్రతి వరి పంట క్వింటాల్ కు 500 బోనస్ అది రైతులు కావచ్చు, కౌలు దారులు కావచ్చు ఇవ్వాలి. అలాగే,  రైతులకు నాణ్యమైన ఎరువులను, సమయానికి పంపిణీ చేయాలి. నీరు విద్యుత్ సమృద్ధిగా అందించాలి. పండిన పంటలు నిల్వ చేసుకోడానికి, ప్రతి మండలంలో గిడ్డంగులను నిర్మించాలి. పండిన పంటకు ,మధ్య దళారులు లేకుండా, గిట్టుబాటు ధరను కల్పించాలి. రైతులు పండించే పంటలపై, అమ్మకాలపై రైతులకే/ కౌలు దారులకే పూర్తి స్వేచ్ఛ ఉండాలి.

05. గృహ జ్యోతి పథకం ద్వారా, పేద, మధ్య తరగతి వారికి మాత్రమే 200 యూనిట్లు ఉచిత విద్యుత్ ఇవ్వాలి. దీనికి , గత సంవత్సరం వినియోగించిన ఆవిరేజ్ యూనిట్లను బేస్ చేసుకుని , కొంత పర్సెంట్ యూనిట్లను అదనంగా కలిపి, ఎల్జిబిలిటీని నిర్ణయించాలి. ఆపై వినియోగించిన వారికి బిల్లులు వేయాలి. అందరికీ ఉచితం అనగానే సాధారణంగా, విద్యుత్ బంధు చేయాలని, పొదుపుగా వాడుకోవలనే ఆలోచన ఉండదు. దీని వలన ప్రభుత్వంపై భారం అధికంగా పడుతుంది. కరెంట్ వాడకం పై సామాజిక బాధ్యతను పెంచాలి.

06. ఇందిరమ్మ ఇండ్లు పథకం ద్వారా, భూకబ్జాలను గురైన  భూములను సేకరించి, అర్హులైన  పేదలకు, మధ్య తరగతి వారికి మాత్రమే ఇండ్లు లేని వారికి డబుల్ బెడ్ రూమ్  ఇండ్లు కట్టించి ఇవ్వాలి. ఇంటి స్థలం ఉన్న వారికి 5 లక్షల రూపాయలు దశల వారీగా ఇవ్వాలి.
ఇండ్లు లేని వారు , వారే ఇండ్లు కట్టుకుంటానంటే 100 గజాలు ఉచిత స్థలాన్ని ఇవ్వాలి. ఇండ్లు లేని జర్నలిస్టులకు, కళాకారులకు ఇండ్లు నిర్మించి ఇవ్వాలి.
ఉద్యమకారులకు గ్యారంటీలో చెప్పిన ప్రకారం 250 గజాలు ఇండ్ల స్థలాలు ఉచితంగా ఇవ్వాలి.
మరి కొందరు ఇండ్లు లేని వారికి , డబ్బు మేము కూడా చెల్లించగలం అనేవారికి, సబ్సిడీతో 10 లక్షల లోపు ఇండ్లు నిర్మించి ఇవ్వాలి.  పూర్తిగా ప్రభుత్వం పైననే భారం పడకుండా, ఇలా ప్రజల భాగస్వామ్యంతో, అందరికీ ఇండ్లు సమకూరే అవకాశం ఉంటుంది. అలానే, ఆల్రెడీ ఇండ్లు ఉన్న వారికి  , ఇండ్లు గానీ, ఇంటి స్థలం గానీ, ఇండ్లు నిర్మించు కోడానికి డబ్బు గానీ ఇవ్వ కూడదు.

07. యువ వికాసం పథకంలో  మీరు ఎలాగో నిరుద్యోగ భృతి గురించి ప్రస్తావించ లేదు. దానికి బదులుగా ముఖ్యమైన ప్రాంతాలలో , ఉద్యోగం వచ్చే వరకు, ఉచిత స్కిల్స్ డెవలప్ మెంట్ కోచింగ్ సంస్థలను ఏర్పాటు చేయాలి. ప్రతి ఒక యువతీ యువకులకు ఉచిత వసతి , ఉచిత భోజనం కల్పించాలి.  ప్రతి మండలంలో ఒక కోచింగ్ సెంటర్ ను, కాలేజీలను ఏర్పాటు చేయాలి. ప్రతి మండలంలో ఇంటర్నేషనల్ స్కూల్ ను ఏర్పాటు చేయాలి. ప్రయివేట్ స్కూళ్ళకు ధీటుగా, నాణ్యమైన విద్యను అందించాలి.
నిరుద్యోగ యువతకు ఉద్యోగావకాశాలు కల్పించాలి.
ప్రభుత్వ శాఖలలో ఖాలీగా ఉన్న ఉద్యోగాలను
ఏ సంవత్సరానివి ఆ సంవత్సరంలోనే, నోటిఫికేషన్లు జారీ చేసి, పరీక్షలు జరిపించి భర్తీ చేయాలి. ఏ అక్రమ బిల్డింగ్ లను కూలగొట్ట కుండా, వాటిని విద్యార్ధులకు వసతి గృహాలుగా మార్చాలి.
08. చేయూత పథకం ద్వారా, అర్హులైన వారికి ఆసరా పెన్షన్ 4000 చెల్లించాలి. అలానే 10 లక్షల ఆరోగ్యశ్రీని భీమాను కల్పించాలి.
09. ఈ 6 గ్యారంటీల అమలుకు ప్రత్యేక వెబ్సైట్ ను
ఏర్పాటు చేయాలి మరియు దాని వివరాలు, అప్లై చేసుకునే విధానం, నియమ నిబంధనలు ప్రచారం చేయాలి.
10. తెలంగాణా రాష్ట్రం కొరకు బలిదానాలు చేసిన కుటుంబాలకు , వారి పిల్లలకు ఆర్ధిక భరోసా, ఆరోగ్య భరోసా మానసిక స్థైర్యాన్ని కల్పించాలి.
11. పార్టీలతో సంబంధం లేకుండా, ప్రతిపక్షాలు, గెలుపు ఓటమిలతో సంబంధం లేకుండా, అన్ని గ్రామాలను, పట్టణాలను సమానంగా అభివృద్ధి చేయాలి. గ్రామాలను, పట్టణాలకు ధీటుగా, ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఉపాధి అవకాశాలు, ప్రయివేట్  పాఠశాలలకు , ప్రభుత్వ  పాఠశాలలో ఉచిత విద్యను  అందించాలి. అలానే ఉచిత వైద్యశాలలను అభివృద్ధి చేస్తే పట్టణాలకు వలసలు తగ్గుతాయి. పట్టణాలలో రద్ధీ తగ్గుతుంది.
12. బెల్ట్ షాపులను పూర్తిగా ఎత్తి వేయాలి.
13. అక్రమ కేసులను, విచారణ చేసి ,ఎత్తి వేయాలి.
14. ప్రజలకు ప్రశ్నించే స్వేచ్ఛను, సమస్యలపై ధర్నాలు చేసుకునే స్వేచ్ఛను, ప్రభుత్వ కార్యాలయాలు, సభలకు, సచివాలయంలోకి అనుమతితో ప్రవేశించేందుకు స్వేచ్ఛను కల్పించాలి.
15. అర్హులైన పేద మధ్యతరగతి వారి కుటుంబాల వారికే రేషన్ కార్డులు వర్తింప చేయాలి. అవి రెండు రకాలుగా ఉండాలి. పేదలకు 1 రూపాయికి కిలో బియ్యం , మధ్య తరగతి వారికి 5 రూ.లకు కిలో సన్న బియ్యం ఇవ్వాలి. అప్పుడే అన్ని రేషన్ కార్డులు ఉపయోగం లోకి వస్తాయి. నేడు దొడ్డు బియ్యం తెచ్చుకుని, తినలేక, అమ్ము కుంటున్నారు. మరికొందరు తెచ్చుకోడానికే ఇష్ట పడటం లేదు. తీసుకోని బియ్యం దొడ్డిదారి పడుతున్నాయి. అన్నపూర్ణ కార్డులకు ఉచిత బియ్యం యధావిధిగా అమలు చేయాలి.
ప్రతి రేషన్ కార్డుకు, ఆధార్ నెంబర్ లింక్ చేయాలి.అప్పుడే అవినీతి, అక్రమాలు తగ్గిపోతాయి.

16.  ట్రాఫిక్ ఛలాన్ల రేట్లు తగ్గించాలి.
17. పెట్రోల్ డీజిల్ పై పన్నులను తగ్గించాలి.
18. ఓటరు కార్డులకు, ఆధార్ నెంబర్ ను లింక్ చేయాలి. అప్పుడే ఒకే వ్యక్తి  పేరు రెండు చోట్ల రిజిస్టర్ అవదు. దీని వలన రెండు ప్రాంతాలలో, రెండు రాష్ట్రాలలో ఓటు వేయడం ఆగిపోతుంది. దొంగ ఓట్లు పడవు
19. గ్రామాలలో, గ్రేటర్ హైదరాబాద్ లో  మోరీలను, డ్రైనేజీ సిస్టంను సరిచేయాలి.
20. కనీసం ప్రతి 5 కి.మీ. దూరంలో ఒక పార్కింగ్ బిల్డింగ్ లను నిర్మించాలి.
21. గ్రేటర్ హైదరాబాద్ లో జనాభా రద్ధీని తగ్గించాలి. రింగ్ రోడ్ల వరకు మెట్రోరైలును విస్తరింప జేయాలి. రింగ్ రోడ్ల చుట్టూ టౌన్ షిప్ లను , ఇన్ఫ్రాస్ట్రక్చర్ ను , విద్య వైద్యం ఉపాధి సంస్థలను నెలకొల్పాలి.
23. రాష్ట్ర ఆదాయం పెంచడానికి, విదేశీ పెట్టుబడులను, విదేశీ ఉపాధి సంస్థలను రప్పించాలి. టూరిజంను అభివృద్ధి చేయాలి.
24. సామాన్యులకు ఓటు హక్కు కావాలని కృషి చేసిన డా. అంబేడ్కర్ గారి కృషికి ఫలితం దక్కాలంటే, ఓటుకు విలువను పెంచాలంటే, ప్రతి ఒక్కరు ఓటు వేయడానికి ఆసక్తి చూపాలంటే, ఓటరు ఆత్మాభిమానం దెబ్బ తీయకుండా ఉండాలంటే,  "పార్టీ పిరాయింపుల నివారణ చట్టాన్ని" మరియు " అవినీతికి పాల్పడే, హామీలను అమలు చేయని అభ్యర్థుల కాల్ బ్యాక్ చట్టాన్ని" తీసుకుని రావాలి.

No comments: