Tuesday, December 19, 2023

రాజకీయ మార్పుల ఆవశ్యకత/ ప్రభుత్వాల మార్పు ఆవశ్యకత

రాజకీయాలలో , ప్రభుత్వ పాలనలలో మార్పు జరుగుతూ ఉండాలి. రాజకీయాల్లో మార్పు జరుగాలని కోరుకోవడం మంచిది కూడా. ఫలాల నిచ్చే ఒక వృక్షానికి చెదలు పట్టినప్పుడు, ఫర్టిలైజర్స్ చల్లి, దానిని రక్షించక పోతే, అవి ఆ వృక్షాన్నే తినేస్తాయి. అలానే , భారతదేశం లాంటి ప్రజాస్వామ్య దేశంలో రాజకీయాలలో మార్పు అనేది లేక పోతే , ఒకే పార్టీ / పాలకులు కంటిన్యూ గా పరిపాలిస్తే, ఆ నాయకులు ఏకచత్రాధిపతులుగా, నియంతలుగా మారిపోతారు. అనేక కుంభకోనాలకు పాల్పడుతారు. అవి ప్రజలకు తెలియకుండా పోతాయి. కోట్లాదిమందికి చెందాల్సిన సంపదను, కేవలం ఒకరిద్దరు నాయకులు తినేస్తారు. ప్రజలకు మాస్క్ లాగా ఉచిత పథకాలనే ఎంగిలి మెతుకులను చల్లి, దోచుకోవడం ప్రారంభిస్తారు. నియంతృత్వ పోకడలతో పాలనను కొనసాగిస్తారు. ఒక సారి ఎన్నికై ఆ పార్టీ అధికారం చేపడితే, ఐదేండ్లు, ఆ నాయకులే పరిపాలిస్తారు. ఒక వేళ నేతలు నిజాయితీగా , సమర్ధవంతంగా పరిపాలిస్తే ప్రజలు సంతోషంగా, ఆనందంగా జీవనం కొనసాగిస్తారు. లేదంటే, ప్రజలు స్వేచ్ఛ లేకుండా, అభివృద్ధి లేకుండా ఐదేండ్లు నరకం అనుభవించాల్సిందే. నాయకులు పోటీ చేసేటప్పుడు బి.ఫామ్ తో పాటు , ఒక అఫిడవిట్ ను సబ్మిట్ చేస్తారు. దానిలో వారి పూర్తి వివరాలు, ఆస్తులు అప్పులు, కేసులు ఎన్నో అన్నీ పొందు పరిచి సంతకం చేస్తారు. ఇది ఒక ప్రమాణ పత్రం లాంటిది. ఇక గెలిచాక, ప్రతి ఒక నేత రెండు ప్రమాణాలు చేస్తారు. ఎలాగంటే, "నేను ఏ తప్పు చేయను, ఏ మోసం చేయను, ప్రభుత్వ ఆస్తులను అన్యాక్రాంతం చేయను, నష్టపరుచను , పారదర్శక పాలన అందిస్తాను, ఆశ్రిత పక్షపాతం లేకుండా పాలన అందిస్తాను, ప్రజలను నిష్పక్షపాతంగా, కన్నబిడ్డలుగా చూసుకుంటాను " అని , వారి వారి దైవ శాక్షిగా ప్రమాణం చేస్తారు. తీరా ఐదేండ్ల తరువాత చూస్తే అన్నీ మోసాలే, అన్నీ దోపిడీలే, వారి ఆస్తులు ఇబ్బడి ముబ్బడిగా పెరిగి పోతున్నాయి. కానీ ఏ స్పీకర్ గానీ, ఏచట్టాలు గానీ, మరొకటి గానీ చర్యలు చేపట్టిన దాఖలాలు ఈ 77 యేండ్ల చరిత్రలో ఇప్పటి వరకు లేవు. కొందరు ధైర్యం చేసి కేసులు పెట్టినా, విచారణలు జరిపించినా, నిరూపించబడినవి, శిక్షలు పడినవి వ్రేళ్ళ మీద లెక్క బెట్టదగినవి మాత్రమే. మరి కొందరు నేతలు, వారి ఆస్తులను కాపాడుకోవడానికి, నేరాలను, మోసాలను కప్పిపుచ్చుకోడానికి, ఒక పార్టీ ప్రజల ఓట్లతో ఎన్నుకోబడి, మరోరకమైన పార్టీ లోకి చేరుతున్నారు. మరల ఎన్నికలప్పుడు, ఏ కేసు లేకుండా, పరిశుద్ధ నాయకులుగా పోటీ చేస్తున్నారు. గెలుస్తున్నారు. ఎక్కడా దేనికీ ఒక నియంత్రణ అంటూ లేదు. ఎన్నికల కమీషన్ , చట్టాలు ఏమి చేయలేనప్పుడు , ప్రజలే ఓటు ద్వారా మార్పు కోరుకోవాలి. ముంచేవారెవరో , అభివృద్ధి చేసేవారెవరో తెలుసుకుని, మార్పు రావాలని కోరుకునే చదువుకున్న యువతీ యువకులు, సామాజిక బాధ్యతగల మేధావులు , ఓటర్లకు ఎన్నికల గురించి అవగాహన కల్పించడంలో తప్పు లేదు. అవినీతి నేతలను, ఎన్నిక కాకుండా చూడడానికి, ఓటర్లు ఎక్కడ ఉంటే అక్కడికి వెళ్ళి, కాళ్ళు వేళ్ళు పట్టుకుని మార్పు వచ్చే విధంగా వారిని మోటివేట్ చేయడంలో తప్పు లేదు. నష్టం లేదు. నేటికీ, మెజారిటీ ప్రజలకు, ప్రజాస్వామ్యంపై ,రాజ్యాంగ హక్కులపై, చట్టాలపై, కోర్టులపై పూర్తి అవగాహన లేక , వారికి ఆ సమయానికి ఉచితంగా ఏది లభిస్తే అదే చివరి అవకాశంగా భావిస్తున్నారు. అందువలననే, రేపు ఆ పార్టీ పోతే, ఉచితాలు, సంక్షేమ పథకాలు లభించవేమో అని భావిస్తున్నారు. అలాంటి వారికి వివరంగా చెప్పి, మార్పు చెందే విధంగా, ప్రజలు అభివృద్ధి చెందే విధంగా, ఎవరికి చేతనైన విధంగా వారు , ఓటర్లను చైతన్య పరచాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరో విషయం ఏమిటంటే, బావిలో నీరు ఎండినపుడే, గాజు పెంకులు బయట పడుతాయన్నట్లు, ఒక నాయకుడు ప్రజలకు మోసం చేసాడా లేదా, రాజ్యాన్ని దోచాడా లేదా అనేది, ఆ నాయకుడు లేదా ఆ పార్టీ ఓడి పోయినపుడే బయట పడుతుంది. అప్పటి వరకు పరిశుద్ధమైన నాయకులు గానే చలామని అవుతారు. చివరగా ప్రజలు గుర్తుంచు కోవల్సింది ఏమంటే, పుట్టుకతో వచ్చే బుద్ధి పుడకల్లోనే పోతుందన్నట్లు, మోసపూరితమైన నాయకులు, మరల మోసమే చేస్తారు, మరల దోచుకుంటూనే ఉంటారు. కాబట్టి అలాంటి నాయకులకు, అలాంటి పార్టీకి మరోసారి అవకాశం ఇవ్వకూడదు. మరోసారి మరో పార్టీని ఎన్నుకోవాలి. మార్పు కోరుకోవాలి. ప్రతి ఐదేండ్ల కొకసారి రాష్ట్ర పతి పాలన విధించాలని, సేవకులైన నాయకులు దోచుకోవడం ఆగిపోవాలని, నేతలలో భయం కలుగాలని. వారిలో సత్ప్రవర్తన రావాలని, ప్రజలకు ప్రశ్నించే స్వేచ్ఛ ఉండాలని, అభివృద్ధి జరుగాలని కోరుకుందాం.

Monday, December 18, 2023

తలసరి అప్పు అప్పు అంటే ఏమిటి? What is mean by per capita Debt?

ఈ మధ్య కాలంలో అతిగా రాష్ట్రాల అప్పుల మీద, ఆదాయాల మీద మరియు తలసరి అప్పుల మీద చర్చ జరుగుతుంది. అలానే ప్రతి రాజకీయ, ప్రభుత్వాల విషయాలు ఈ మధ్యనే బహిరంగంగానే ప్రజలకు తెలుస్తున్నాయి. ఇది మంచి శుభ పరిణామం . కొందరు రాష్ట్రంలో అప్పులు పెరిగితే , ఒక్కొక్కరి పైన ఇంత భారం పడుతుందని, దానికి మరి కొందరు, ఒక్కొక్కరిపై అంత భారం పడితే ఏంది, మంత్రులు ఏమైనా మీ ఇంటికొచ్చి మిమ్మల్ని మిత్తి అడుగు తున్నారా, అసలడుగుతున్నారా అని అమాయకంగా మాట్లాడుతుంటారు . నిజమే అలా ఎవరూ ఇంటికొచ్చి ఏమి అడుగరు. డిమాండ్ చేయరు. ముందుగా "తలసరి అప్పు" అంటే ఏమిటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఉదాహరణకు ఒక రాష్ట్రానికి 5లక్షల కోట్ల అప్పు ఉంది అని అనుకుందాం. ఇక ఆ రాష్ట్రంలో సుమారుగా 3కోట్ల50లక్షల జనాభా ఉందనుకుందాం. అప్పుడు ఆ 5 లక్షల కోట్ల అప్పును, 3 కోట్ల 50 లక్షల జనాభాతో భాగిస్తే, ఒక్కొక్కరిపై అప్పు 1,42.857 అని తెలుస్తుంది. దీనినే "తలసరి అప్పు" అని , ఒక్కొక్కరి పై పడే భారం అని అంటారు. వ్యక్తుల లాగానే ప్రభుత్వాలు అప్పు చేయడం అనేది సహజం. అయితే ఆ అప్పు రాష్ట్ర అభివృద్ధికి చేస్తే సమస్య ఏమిలేదు. అప్పు ఎంత చేయాలి , దానిని ఎలా తీర్చగలం, దాని వలన ఎంత కాలానికి ప్రయోజనం చేకూరుతుంది, అప్పులు భరించే స్తోమత రాష్ట్రానికి , దేశానికి ఉందా అనేది పరిశీలించి అప్పులు చేస్తే తప్పు లేదు. ఇప్పుడు అప్పుగా కనబడినా, భవిష్యత్తులో దాని ఫలాలు, మనం , మన రేపటి తరాల వారు అనుభవిస్తారు. కానీ అదే అప్పును, స్వార్థంతో కొందరి కుటుంబాల తరాలకో, రేపటి అధికారం కొరకో, దోచుకుంటూ పోతే, నేడు ప్రజలు, రేపటి వారి తరాలు మరింత పేదరికం లోకి దిగజారి పోతారు, సోమరులుగా, బానిసలుగా మారిపోతారు. ఇక ఏ ప్రభుత్వమైనా ఆ అప్పును, దానిపై వడ్డీని ఎలా రికవర్ చేస్తారంటే; 01. ప్రజలపై అధిక పన్నుల భారం మోపుతారు 02. ట్రాఫిక్ చలాన్ల రేట్లు పెంచుతారు 03. ప్రజలకు చెల్లించాల్సిన సంక్షేమ పథకాలను ఆపేస్తారు. 04. విద్యార్థులకు చెల్లించాల్సిన ఫీజు రీయింబర్స్మెంట్ నిలిపేస్తారు 05. ప్రజలకు సంబంధించిన ఉచిత విద్య, వైద్య సదుపాయాలు ఆపేస్తారు 06. కార్య కర్తలకు మినహా అర్హులైన వారికి సంక్షేమ పథకాలు నిలిపేస్తారు 07. ప్రభుత్వ ఖాలీలను/ఉద్యోగాలను భర్తీ చేయరు 08. ప్రభుత్వ బడి పిల్లలకు భోజన సదుపాయాలు, పుస్తకాలు, బట్టలు సప్లై చేయరు. 09. కాంట్రాక్టర్లకు చెల్లించాల్సిన బకాయిలను నిలిపేస్తారు. 10. రోడ్లను, మోరీలను, పారిశుధ్యాన్ని పట్టించుకోవడం శుద్ధ దండుగ అని అనుకుంటారు. 11. నిజాయితీగా పన్నులు కట్టే వారు అసహనానికి గురవుతారు 12. ప్రభుత్వ భూములను అనుంగులైన వారికి, తక్కువ ధరలకు అమ్ముతారు. 13. అప్పటికీ అప్పు, వడ్డీలు తీరక పోతే, రాబోయే ప్రభుత్వం నెత్తిన వేస్తారు. గత చరిత్రను చూస్తే ఇది ప్రస్తుతం జరిగేది. అంతేకానీ ఏ మంత్రి ఇంటికి వచ్చి అసలు గానీ మిత్తి గానీ అడుగరు.

Tuesday, December 12, 2023

మహిళలకు తెలంగాణా అంతటా ఉచిత ప్రయాణం (FREE BUS TRAVEL TO WOMEN IN TELANGANA

"ఉచితం" అనేది రెండు వైపుల పదునైన ఆయుధం లాంటిది. ఉచితం పేర్లు ఏవైనా అవి కొందరికి మేలు కలిగిస్తే మరికొందరికి సమస్యలను సృష్టిస్తాయి. ఉచితాల వలన ప్రభుత్వానికి  కొన్ని లాభాలుంటే, కొన్ని నష్టాలు కూడా ఉంటాయి. ఉచితాల వలన కొన్ని రాష్ట్రాలు, దేశాలు అప్పుల పాలై  కుప్ప కూలినవి కూడా ఉన్నాయి.

మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం వలన కలిగే 
 కొన్ని ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం:

01. మహిళలకు ఉచిత ప్రయాణం వలన, ఆర్ధిక భారం తగ్గుతుంది. బస్ పాస్ ల డబ్బు, బస్సు చార్జీలు మిగలడం వలన, పేద మహిళలు వాటిని ఇతర ఖర్చులకు పొదుపుగా వాడుకుంటారు.
02. చిరు ఉద్యోగులకు, విద్యార్థినులకు, అనారోగ్యంతో ఉన్న వారు , అడ్డకూలీలకు, దూర ప్రాంతాల వ్యాపారస్తులకు చాలా మేలు జరుగుతుంది.
03. అనారోగ్యంతో ఉన్న మహిళలు, వారి పిల్లలు , 5 సం.లోపు ఉన్న మగ పిల్లలకు కూడా మెరుగైన వైద్యం కోసం పట్టణాలకు వచ్చే వారికి , ఉచిత బస్సు ప్రయాణం ఎంతో ఊరట నిస్తుంది.
04. పాచి పనులు, నర్సు పనులు, ఇతర సర్వీసులు అందించే వారు, ఇంటి కిరాయీలు తక్కువగా ఉన్న చోట నివసిస్తారు. రవాణా చార్జీల భారం భరించలేక, ఆ చుట్టుపక్కలనే, తక్కువ డబ్బులకు పని చేస్తారు.
ఇప్పుడు వారు ఏ ప్రాంతాలలో డబ్బులు ఎక్కువగా ఇస్తారో అక్కడికి వెళ్ళి ఎక్కువ డబ్బు సంపాదించు కోగలరు
05. రవాణా చార్జీల వలన కొందరు, వారి పనులను వాయిదా వేసుకుంటారు. 4, 5 పనులకు కలిపి ఒకేసారి వెలుతారు. ఇప్పుడు అలా పెండింగ్ పెట్టరు.
06. ఏ మీటింగ్ లు ఉన్నా, మహిళలందరు కలిసి, ఎంత దూరమైనా వెళ్ళి పోతారు.
07. విద్యార్ధినులను, ఉద్యోగ మహిళలను స్కూటర్ల పై , కార్లలో డ్రాప్ చేసే , తల్లిదండ్రులకు, భర్తలకు, ఎంతో డబ్బు, సమయం ఆదా అవుతుంది,
08. స్త్రీలకు ఆర్థిక సాధికారత పెరుగుతుంది. స్వేచ్ఛ, ధైర్యం, కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరుగుతాయి. ప్రయాణాలపై అవగాహన పెరుగుతుంది.
09. మహిళలు, గుళ్ళకు, ఫంక్షన్లకు , విహారాలకు, బంధువుల ఇండ్లకు వెలుతూ ఉండటం వలన ప్రశాంతత లభిస్తుంది.
10. చిన్న చిన్న పనులకు, మగవారు స్కూటర్లపై, కార్లలో వెళ్ళే బదులు, వారి కూతుర్లను, భార్యలను, తల్లులను పంపిస్తారు. దీని వలన ఫ్యామిలీకి అధిక డబ్బు, సమయం ఆదా అవుతుంది.
11. స్త్రీలే అధికంగా వెలుతారు కాబట్టి, బస్సులలో సెక్యూరుడుగా ఫీలవుతారు.
12. దూర ప్రాంతాలని, బస్సు చార్జీల భారం భరించలేక, కొందరు పేద విద్యార్థినిలు, మధ్యలోనే చదువులు మానేస్తున్నారు. అలాంటి వారు ఇప్పుడు చదువుకోడానికి ఆసక్తి చూపుతారు.
13. అంతే కాకుండా రవాణా చార్జీలు భరించలేక కొందరు ఆడ పిల్లలను దగ్గరలోని ఏదో ఒక స్కూల్ లో చదివిస్తున్నారు. ఇప్పుడు వారు ఎంత దూరమైనా మంచి స్కూళ్ళలో చదివించడానికి అవకాశం ఉంది.
14. మరికొందరు పట్టణాలలో, రూములు రెంటుకు తీసుకుని చదవడానికి, ఉద్యోగం చేయడానికి, చాలా డబ్బు ఖర్చు అవుతుంది. రిస్క్ అవుతుంది, సేఫ్టీ ఉండటం లేదు. ఇప్పుడు వారు ఇంటి నుండే పట్టణాలకు వెళ్ళి చదువుకుని లేదా ఉద్యోగం చేసి రాత్రి వరకు ఇంటికి చేరవచ్చు.
15. రవాణా ఖర్చు లేక పోతే అన్ని ప్రాంతాలలో ధరలు తగ్గి పోతాయి.
16. రవాణా చార్జీలు లేక పోవడం వలన, గ్రామీణ ప్రాంతాల మహిళలు, అక్కడ తక్కువ ధరలకు అమ్మే బదులు, పట్టణాలకు వచ్చి ఎక్కువ ధరలకు కూరగాయలు, పండ్లు, పూలు, ఇతర వస్తువులు, మధ్య దళారులు లేకుండా అమ్మకో గలరు.
17. స్త్రీల మూవ్ మెంట్ పెరుగుతుంది. ఇప్పటి వరకు రవాణా చార్జీలు ఉండటం వలన, ఒంటింటి కుందేలు లాగానే ఉండేవారు. ఇప్పుడు అది ఉండదు. అవసరాలు  ఉంటే ఎక్కడికైనా వెలుతారు.
18. పార్లమెంట్ లో పాసైన మహిళా బిల్లు కంటే గొప్పగా , పూర్తి స్వేచ్ఛ లభించినట్లుగా, స్త్రీలు చాలా గొప్పగా ఫీలవుతుంటారు 
19. పర్యాటక రంగం అభివృద్ధి చెందగలదు. దీని వలన ప్రభుత్వానికి పరోక్ష పన్నుల రూపంలో ఆదాయం పెరుగగలదు.

ఇప్పుడు ఇక కొన్ని నష్టాల గురించి తెలుసుకుందాం:
01. మహిళలకు బస్సు చార్జీలు ఉచితమైతే, అది ప్రభుత్వానికి నష్టం. రోజుకి అది సుమారుగా 7 కోట్ల రూపాయలు ఉంటుందని అని ఒక అంచనా
02. బస్సు చార్జీలు ఉచితం కావడం వలన, మెట్రో, ఎంఎం టీఎస్ ట్రేన్లలో ప్యాసెంజర్లు తగ్గిపోతారు. అందువలన వీటికి నష్టం వాటిల్లుతుంది.
03. బస్సులలో ట్రాన్స్ జెండర్స్ కు ఫ్రీ అవకాశం కల్పించారు ‌. వీరిలో ఎవరు నిజమైన ట్రాన్స్ జెండర్సో తెలియదు. బెగ్గింగ్ కొరకు చీరెలు కట్టుకుని ప్రయాణం చేస్తే, మహిళలకు చాలా ఇబ్బంది కరంగా మారవచ్చు.
04. మహిళలందరికీ ఉచిత బస్సు ప్రయాణం కల్పించడం వలన, ధనవంతులు, ఆదాయ పన్నులు కట్టే వారు, కార్లు, బస్సులు ఉన్న వారు కూడా, ఆర్టీసి బస్సులలో ప్రయాణించడం వలన, ప్రభుత్వానికి అధిక భారం పడుతుంది. అలానే బస్సులలో అనవసరంగా రద్దీ పెరుగుతుంది. దీని వలన స్థోమత గల, ఉద్యోగ భాద్యత గల మహిళలకు అన్ కంఫర్ట్ గా ఉంటుంది.
05. మహిళలకు అధిక భారం పెరుగుతుంది. ప్రతి పనికి, పేద మగవారు, మీకు ఉచితం కదా అని, మద్యానికి , మందులకు, బ్యాంకులకు, షాపింగ్ లకు స్త్రీలనే బయటకు పంపిస్తారు. మగవారు చెసే బయటి పనులన్నిటికీ స్త్రీలనే పంపించడానికి ఆలోచిస్తారు.
06. మొదట సరదాగానే ఉంటుంది. కానీ కొంత కాలం తర్వాత వారు చాలా భారంగా ఫీలవుతారు. ఆ తర్వాత బయట స్నేహాలు పెరిగి, ఇతర వ్యాపకాలకు అలవాటు పడవచ్చు.
07. కుటుంబాలలో, ప్రతి రోజూ ఏదో ఒక సమస్య ఉండనే ఉంటుంది. అలాంటి సమస్యలు జరిగినప్పుడు, స్త్రీలు ఇంట్లోనే సర్దుకు పోయే వారు. ఇప్పుడు అలా ఇంటి పట్టున ఉండకుండా, ప్రశాంతత కొరకు అని ఎక్కడికైనా వెళ్ళి పోతారు.
దీని వలన మరిన్ని సమస్యలు రావడానికి అవకాశం ఉంది.
08. బస్సు ప్రయాణం ఉచితమని తిరిగే అలవాటు ఉన్న కొందరు  ప్రక్క స్త్రీలను వెంటేసుకుని తిరగడం వలన ఉన్నతమైన మంచి కుటుంబాలలో, భార్యా భర్తల సంబంధాలు, తల్లిదండ్రులు పిల్లల సంబంధాలు దూరమయ్యే అవకాశాలను కొట్టి పారేయ లేము.
09. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే అవకాశం లేక పోలేదు
10. పని ఉన్నా లేకున్నా బస్సులలో ఉచితం కాబట్టి, మహిళలు ప్రయాణించడం వలన, బస్సులలో మహిళల సంఖ్య పెరిగి, ప్రభుత్వానికి నష్టం వాటిల్లుతుంది.
11. ఉచితం అనగానే రద్దీ, దీనికి తోడు, అన్నీ మరిచి,  బస్సులలో ఆనందంగా ఉంటారు. దొంగలకు అలాంటి అవకాశమే కావాలి. ఆ కారణంగా బస్సులలో దొంగతనాలు జరిగే అవకాశం లేక పోలేదు.
12. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కావడం వలన, ఆటోలకు, వోలా, ఊబర్ లాంటి టాక్సీ లకు నష్టం వాటిల్లే అవకాశం ఉంది. చక్రాలు తిరుగుతేనే వారు ఇ.ఎమ్.ఐలు , పిల్లల ఫీజులు, టాక్స్ లను కట్టగలరు. కుటుంబాలను పోషించుకోగలరు. లేదంటే వారి కుటుంబాలు రోడ్డున పడగలవు.
13. ద్వి చక్ర వాహనాల అమ్మకాలు తగ్గి పోతాయి.
మధ్య దళారులకు నష్టం వాటిల్లుతుంది.
బస్సులు ఉచితం అని ఓ పది మంది మహిళలు కలిసి రెగ్యులర్ గా , గుళ్ళకు, విహార యాత్రలకు తెలంగాణా అంతటా తిరుగు తుంటే, ప్రభుత్వానికి నష్టం వాటిల్లే అవకాశం ఉంది.

మహాలక్ష్మి పథకం ఉచిత బస్సు ప్రయాణం మరింత ప్రయోజనకరంగా మారాలంటే ఏమి చేయాలి?

ఉచితాలకు అలవాటు పడిన ప్రజలు, హామీ ఇచ్చిన హామీలలో ఏ చిన్న మార్పు చేసినా విరుచుకు పడుతారు. వీరికి తోడు ప్రతి పక్షాలు మరియు విమర్శకులు తోడవుతారు. ఇది సహజం. అయినప్పటికీ,
01. ఆదాయ పన్నులు చెల్లించే వారు, కార్లు, బస్సులు ఉన్న, ధనవంతులైన మహిళలు, వారి పిల్లలు, ఉచితం మాకు వద్దు అనే మహిళలు, వారే స్వచ్చందంగా ఉచిత బస్సులలో ప్రయాణించ వీలు లేకుండా, వారికి ఉచిత కార్డులను ఇష్యూ చేయకూడదు. దీని వలన కొంత వరకైనా ఆటో, టాక్సీ డ్రైవర్ లకు మరియు ప్రభుత్వానికి కొంత మేలు జరుగ గలదు.
02. విద్యార్ధినులకు, ఉద్యోగం కొరకు వెళ్ళే మహిళలకు, చిరు ఉద్యోగులకు, పేద మహిళా కూలీలకు, చిరు వ్యాపారస్తులకు, అర్హులైన ట్రాన్స్ జెండర్స్ కు , మాత్రమే ఫ్రీ కార్డులను ఇష్యూ చేయాలి.
03. ముందుగా, ఇప్పటి వరకు బస్ పాస్ లు కలిగిన మహిళలందరికీ, విద్యార్ధినులందరికీ, ఫ్రీ కార్డులను జారీ చేయాలి. ఆ తర్వాత ఇతర మహిళలకు జారీ చేయాలి.
04. ఆఫీస్, స్కూల్ టైమ్ లలో, అవసరమైన రూట్లలో మహిళలకు స్పెషల్ బస్సులను వేయాలి.
బస్సుల సంఖ్యను పెంచాలి, సమయపాలన పాటించాలి
05. ప్రభుత్వ పాఠశాలలో ఫ్రీ అంటే ఎంత మంది పిల్లలు చదువుతున్నారు. అలానే  బస్సులలో ఉచితం అన్నంత మాత్రాన అందరూ బస్సులలో నే వెళ్ళరు . వారి సౌకర్యం, వేగం , సెక్యూరిటీ  , ఇంటి వరకు చేరే విధానం చూసుకుంటారు. వీధుల్లోకి, ఇండ్ల వరకు బస్సులు పోవు . ఆటో , టాక్సీ వారు ఇవన్నీ గమనించి, ప్రయాణికులలో మన్నత పెంచు కుంటే, వారి గిరాకీ ఎక్కడికి పోదు. ధరలు తగ్గించి పోటీ పడాలి. 
06. మెట్రో, ఎంఎం టీఎస్ లకు కూడా, ఎలాంటి నష్టం వాటిల్లదు. దానిలో ప్రయాణించే ధనికులు, వేగం, సేఫ్టీ కోరుకునే వారు వాటిల్లోనే వెలుతారు.
07. గ్రామ ప్రాంతాలకు, పల్లె వెలుగు బస్సులను పెంచాలి
08. ఆర్టీసీకి నష్టం రాకుండా, వారి యొక్క సమస్యలను పరిష్కరిస్తూ, ఆర్టీసి ఆదాయ వనరులను పెంచాలి.
09. ఆర్టీసీకి నెలకోసారి, మహిళలకు సంబంధించిన చార్జీలను చెల్లించాలి
19. ప్రభుత్వానికి నష్టం కలుగకుండా, టూరిజం , పార్కింగ్స్  అభివృద్ధి చేయాలి. దీని వలన ప్రభుత్వానికి పరోక్ష పన్నుల రూపంలో ఆదాయం పెరుగగలదు.
11. నిజాయితీగా అభివృద్ధి పనులు చేపడుతూ, మెల్లగా మెల్లగా ఉచితాలను తగ్గించడానికి ప్రయత్నాలు చేపట్టాలి. ప్రజలలో చైతన్యం తీసుకు రావాలి. ఇది వ్యవస్థలలోనే రావాలి. ఓటు బ్యాంకు కొరకు ఉచితాలను ఇవ్వాలని పోటీ పడుతున్నారు. ఉచితాలకు అలవాటు పడిన ప్రజలు, ఎవరు ఎక్కువ ఉచితాలు ఇస్తే వారికి ఓటు వేస్తున్నారు. లేదంటే ఇంట్లో నుండి కదలడం  లేదు. ఉచితాలను ప్రోత్సహించే వారికి కఠిన శిక్షలు వేసే, ఎన్నికల వ్యవస్థ రావాలి. ఓటర్లకు పంచే డబ్బు, ఏ ప్రాంతంలో పట్టుబడితే, ఆ ప్రాంతంలో అభివృద్ధికే , మొత్తం డబ్బును ఖర్చు చేసే చట్టాలు రావాలి. 

Friday, December 8, 2023

కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన 6 గ్యారంటీల అమలుకు సలహాలు, సూచనలు

 ఏ ప్రభుత్వమైనా, ప్రజల ఆలోచనలను, సూచనలను, సలహాలను తీసుకుంటూ, పరిపాలన సాగిస్తేనే, ప్రభుత్వం పది కాలాల పాటు ఫరిడవిల్లు తుంది. అలానే నాయకులు చరిత్రలో, ప్రజలు గుండెల్లో స్థిర స్థాయిగా నిలిచి పోతారు .


రాష్ట్రం అప్పుల పాలు కాకుండా, మిగులు నిధులుతో రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే, అన్ని వర్గాల , అన్ని ప్రాంతాల ప్రజలు, అన్ని వయస్సుల వారు సంతోషంగా జీవిస్తూ, అభివృద్ధి పథంలో ముందుకు సాగాలంటే, పాలకులు
ప్రజల సలహాలు, సూచనలు  తప్పక పరిశీలనకు తీసుకుంటారని ఆశిస్తున్నాం.

నేడు జీవన వ్యయం అనూహ్యంగా పెరిగింది కాబట్టి, అర్బన్ ఏరియాలో నివసించే వారి వార్షిక ఆదాయం 5 లక్షల లోపు ఉన్న వారిని, అదే రూరల్ ఏరియాలో నివసించే వారి వార్షిక ఆదాయం 3 లక్షల లోపు ఉన్న వారిని  ఈ 6 గ్యారంటీ పథకాలకు అర్హులుగా పరిగణించాలి. అలాగే తప్పకుండా  ఈ 6 గ్యారంటీలను అమలు చేయాలి.
అలానే 5 నుండి 10 లక్షల లోపు  వార్షికాదాయం ఉన్న వారిని మధ్యతరగతి గాను  పరిగణించాలి.

అర్హులైన వారికి ఈ 6 గ్యారంటీలను అమలు చేయడం సాధ్యమా అంటే , ఖచ్చితంగా సాధ్యమే.
ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేసి, అవినీతి సొమ్మును రికవరీ చేస్తూ, భూకబ్జాలను తిరిగి రాబట్ట గలుగుతే, భూసీలింగ్ లను అమలు చేసినట్లయితే, అవినీతి  పథకాలను అరికట్టి నట్లయితే, తక్షణమే ధరణి పోర్టల్ ప్రక్షాళన చేపడితే ఈ 6 గ్యారంటీలు కచ్చితంగా సాధ్యమవుతాయి. సులభంగా అమలు జరుగుతాయి కూడా.

01. మహాలక్ష్మి పథకం ద్వారా, అర్హులైన మహిళలకే,  ప్రతినెలా 2500 రూ.లు ఇవ్వాలి. ఆదాయ పన్నులు కట్టే వారికి, కార్లు, లారీలు, బస్సులు ఉన్న కుటుంబాల మహిళలకు వర్తింప చేయకూడదు. ప్రతి కుటుంబానికి 500 రూ.లకే గ్యాస్ సిలిండర్ తప్పక ఇవ్వాలి, మహిళలకు తెలంగాణా అంతటా ఆర్టీసి బస్సులలో ఉచిత ప్రయాణం అమలు చేయాలి. అయితే చాలా బస్సు రవాణా సౌకర్యాలు లేవు. అలాంటి రేట్లను గుర్తించి బస్సులను నడుపాలి. ఇప్పటి వరకు ఆయా రూట్లలో, ఆటోలు, క్యాబ్ లో పైన ఆధారపడాల్సి వస్తున్నది. మరో విషయం, ఉచిత ప్రయాణం కాబట్టి మహిళలు ఎక్కువగా ప్రయాణం చేయడం జరుగుతుంది. కాబట్టి, రద్దీ ఉన్న రూట్లను గుర్తించి, మహిళలకు సెపరేట్ బస్సులను వేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించడం వలన విద్యార్థినులకు, చిరు ఉద్యోగ మహిళలకు చాలా మేలు చేకూరుస్తుంది. ఆర్ధిక భరోసా నిస్తుంది. మహిళలకు ఉచితం అనేసరికి , వారి ఫ్యామిలీ తో కూడా వస్తారు కాబట్టి, బస్సుల్లో రద్దీ పెరుగుతుంది. ఆ విధంగా ఆర్టీసీ లాభాల బాట పడుతుంది.
02. రైతు భరోసా పథకం ద్వారా, ప్రస్తుతం ఉన్నటువంటి, రైతుల రుణాలను పూర్తిగా మాఫీ చేయాలి. ఆ తర్వాత 10 ఎకరాల లోపు మాగాణి భూమి ఉన్నవారికి, 15 ఎకరాల లోపు మెట్ట భూమి ఉన్న వారికి మాత్రమే రైతు రుణమాఫీ వర్తింప చేయాలి.
03. అలానే రైతు బంధు పథకం 10 ఎకరాల లోపు మాగాణి భూమి, 15 ఎకరాల లోపు మెట్ట భూమి ఉన్న వారికే వర్తింప చేయాలి. మైనింగ్ భూములకు, గుట్టలకు, కాలేజీల భూములకు, బీడు భూములకు, భూస్వాములకు రైతు బంధు పథకం, రుణమాఫీ వర్తింప జేయకూడదు.  ఇక పోతే,
భూమిని సాగు చేసేది, భూమిని అభివృద్ధి చేసేది , రైతుల భూమిని కాపాడేది , రేయింబవళ్ళు కష్టపడేది, పంట పండినా, పండక పోయినా, గిట్టుబాటు ధర దొరకక పోయినా భరించేది , పంటలను పండించేది కౌలు దారులు కాబట్టి , కౌలు దారులకు సం.రానికి 15000 రూ.లు (రెండు దఫాలుగా)  ఇవ్వాలి.
ఒక వేళ రైతులే పంటలు పండిస్తే, రైతులకే రైతు బంధు , రుణమాఫీ వర్తింప చేయాలి.
04. అలానే మీరు ఇచ్చిన గ్యారంటీల ప్రకారం వ్యవసాయ కూలీలకు సం. రానికి 12000 రూ.లు ఇవ్వాలి . కూలీలు అంటే రైతు బంధు రాని వారు మాత్రమే కూలీలు. కూలీలకు ప్రత్యేక కార్డులను జారీ చేయాలి. , ప్రతి వరి పంట క్వింటాల్ కు 500 బోనస్ అది రైతులు కావచ్చు, కౌలు దారులు కావచ్చు ఇవ్వాలి. అలాగే,  రైతులకు నాణ్యమైన ఎరువులను, సమయానికి పంపిణీ చేయాలి. నీరు విద్యుత్ సమృద్ధిగా అందించాలి. పండిన పంటలు నిల్వ చేసుకోడానికి, ప్రతి మండలంలో గిడ్డంగులను నిర్మించాలి. పండిన పంటకు ,మధ్య దళారులు లేకుండా, గిట్టుబాటు ధరను కల్పించాలి. రైతులు పండించే పంటలపై, అమ్మకాలపై రైతులకే/ కౌలు దారులకే పూర్తి స్వేచ్ఛ ఉండాలి.

05. గృహ జ్యోతి పథకం ద్వారా, పేద, మధ్య తరగతి వారికి మాత్రమే 200 యూనిట్లు ఉచిత విద్యుత్ ఇవ్వాలి. దీనికి , గత సంవత్సరం వినియోగించిన ఆవిరేజ్ యూనిట్లను బేస్ చేసుకుని , కొంత పర్సెంట్ యూనిట్లను అదనంగా కలిపి, ఎల్జిబిలిటీని నిర్ణయించాలి. ఆపై వినియోగించిన వారికి బిల్లులు వేయాలి. అందరికీ ఉచితం అనగానే సాధారణంగా, విద్యుత్ బంధు చేయాలని, పొదుపుగా వాడుకోవలనే ఆలోచన ఉండదు. దీని వలన ప్రభుత్వంపై భారం అధికంగా పడుతుంది. కరెంట్ వాడకం పై సామాజిక బాధ్యతను పెంచాలి.

06. ఇందిరమ్మ ఇండ్లు పథకం ద్వారా, భూకబ్జాలను గురైన  భూములను సేకరించి, అర్హులైన  పేదలకు, మధ్య తరగతి వారికి మాత్రమే ఇండ్లు లేని వారికి డబుల్ బెడ్ రూమ్  ఇండ్లు కట్టించి ఇవ్వాలి. ఇంటి స్థలం ఉన్న వారికి 5 లక్షల రూపాయలు దశల వారీగా ఇవ్వాలి.
ఇండ్లు లేని వారు , వారే ఇండ్లు కట్టుకుంటానంటే 100 గజాలు ఉచిత స్థలాన్ని ఇవ్వాలి. ఇండ్లు లేని జర్నలిస్టులకు, కళాకారులకు ఇండ్లు నిర్మించి ఇవ్వాలి.
ఉద్యమకారులకు గ్యారంటీలో చెప్పిన ప్రకారం 250 గజాలు ఇండ్ల స్థలాలు ఉచితంగా ఇవ్వాలి.
మరి కొందరు ఇండ్లు లేని వారికి , డబ్బు మేము కూడా చెల్లించగలం అనేవారికి, సబ్సిడీతో 10 లక్షల లోపు ఇండ్లు నిర్మించి ఇవ్వాలి.  పూర్తిగా ప్రభుత్వం పైననే భారం పడకుండా, ఇలా ప్రజల భాగస్వామ్యంతో, అందరికీ ఇండ్లు సమకూరే అవకాశం ఉంటుంది. అలానే, ఆల్రెడీ ఇండ్లు ఉన్న వారికి  , ఇండ్లు గానీ, ఇంటి స్థలం గానీ, ఇండ్లు నిర్మించు కోడానికి డబ్బు గానీ ఇవ్వ కూడదు.

07. యువ వికాసం పథకంలో  మీరు ఎలాగో నిరుద్యోగ భృతి గురించి ప్రస్తావించ లేదు. దానికి బదులుగా ముఖ్యమైన ప్రాంతాలలో , ఉద్యోగం వచ్చే వరకు, ఉచిత స్కిల్స్ డెవలప్ మెంట్ కోచింగ్ సంస్థలను ఏర్పాటు చేయాలి. ప్రతి ఒక యువతీ యువకులకు ఉచిత వసతి , ఉచిత భోజనం కల్పించాలి.  ప్రతి మండలంలో ఒక కోచింగ్ సెంటర్ ను, కాలేజీలను ఏర్పాటు చేయాలి. ప్రతి మండలంలో ఇంటర్నేషనల్ స్కూల్ ను ఏర్పాటు చేయాలి. ప్రయివేట్ స్కూళ్ళకు ధీటుగా, నాణ్యమైన విద్యను అందించాలి.
నిరుద్యోగ యువతకు ఉద్యోగావకాశాలు కల్పించాలి.
ప్రభుత్వ శాఖలలో ఖాలీగా ఉన్న ఉద్యోగాలను
ఏ సంవత్సరానివి ఆ సంవత్సరంలోనే, నోటిఫికేషన్లు జారీ చేసి, పరీక్షలు జరిపించి భర్తీ చేయాలి. ఏ అక్రమ బిల్డింగ్ లను కూలగొట్ట కుండా, వాటిని విద్యార్ధులకు వసతి గృహాలుగా మార్చాలి.
08. చేయూత పథకం ద్వారా, అర్హులైన వారికి ఆసరా పెన్షన్ 4000 చెల్లించాలి. అలానే 10 లక్షల ఆరోగ్యశ్రీని భీమాను కల్పించాలి.
09. ఈ 6 గ్యారంటీల అమలుకు ప్రత్యేక వెబ్సైట్ ను
ఏర్పాటు చేయాలి మరియు దాని వివరాలు, అప్లై చేసుకునే విధానం, నియమ నిబంధనలు ప్రచారం చేయాలి.
10. తెలంగాణా రాష్ట్రం కొరకు బలిదానాలు చేసిన కుటుంబాలకు , వారి పిల్లలకు ఆర్ధిక భరోసా, ఆరోగ్య భరోసా మానసిక స్థైర్యాన్ని కల్పించాలి.
11. పార్టీలతో సంబంధం లేకుండా, ప్రతిపక్షాలు, గెలుపు ఓటమిలతో సంబంధం లేకుండా, అన్ని గ్రామాలను, పట్టణాలను సమానంగా అభివృద్ధి చేయాలి. గ్రామాలను, పట్టణాలకు ధీటుగా, ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఉపాధి అవకాశాలు, ప్రయివేట్  పాఠశాలలకు , ప్రభుత్వ  పాఠశాలలో ఉచిత విద్యను  అందించాలి. అలానే ఉచిత వైద్యశాలలను అభివృద్ధి చేస్తే పట్టణాలకు వలసలు తగ్గుతాయి. పట్టణాలలో రద్ధీ తగ్గుతుంది.
12. బెల్ట్ షాపులను పూర్తిగా ఎత్తి వేయాలి.
13. అక్రమ కేసులను, విచారణ చేసి ,ఎత్తి వేయాలి.
14. ప్రజలకు ప్రశ్నించే స్వేచ్ఛను, సమస్యలపై ధర్నాలు చేసుకునే స్వేచ్ఛను, ప్రభుత్వ కార్యాలయాలు, సభలకు, సచివాలయంలోకి అనుమతితో ప్రవేశించేందుకు స్వేచ్ఛను కల్పించాలి.
15. అర్హులైన పేద మధ్యతరగతి వారి కుటుంబాల వారికే రేషన్ కార్డులు వర్తింప చేయాలి. అవి రెండు రకాలుగా ఉండాలి. పేదలకు 1 రూపాయికి కిలో బియ్యం , మధ్య తరగతి వారికి 5 రూ.లకు కిలో సన్న బియ్యం ఇవ్వాలి. అప్పుడే అన్ని రేషన్ కార్డులు ఉపయోగం లోకి వస్తాయి. నేడు దొడ్డు బియ్యం తెచ్చుకుని, తినలేక, అమ్ము కుంటున్నారు. మరికొందరు తెచ్చుకోడానికే ఇష్ట పడటం లేదు. తీసుకోని బియ్యం దొడ్డిదారి పడుతున్నాయి. అన్నపూర్ణ కార్డులకు ఉచిత బియ్యం యధావిధిగా అమలు చేయాలి.
ప్రతి రేషన్ కార్డుకు, ఆధార్ నెంబర్ లింక్ చేయాలి.అప్పుడే అవినీతి, అక్రమాలు తగ్గిపోతాయి.

16.  ట్రాఫిక్ ఛలాన్ల రేట్లు తగ్గించాలి.
17. పెట్రోల్ డీజిల్ పై పన్నులను తగ్గించాలి.
18. ఓటరు కార్డులకు, ఆధార్ నెంబర్ ను లింక్ చేయాలి. అప్పుడే ఒకే వ్యక్తి  పేరు రెండు చోట్ల రిజిస్టర్ అవదు. దీని వలన రెండు ప్రాంతాలలో, రెండు రాష్ట్రాలలో ఓటు వేయడం ఆగిపోతుంది. దొంగ ఓట్లు పడవు
19. గ్రామాలలో, గ్రేటర్ హైదరాబాద్ లో  మోరీలను, డ్రైనేజీ సిస్టంను సరిచేయాలి.
20. కనీసం ప్రతి 5 కి.మీ. దూరంలో ఒక పార్కింగ్ బిల్డింగ్ లను నిర్మించాలి.
21. గ్రేటర్ హైదరాబాద్ లో జనాభా రద్ధీని తగ్గించాలి. రింగ్ రోడ్ల వరకు మెట్రోరైలును విస్తరింప జేయాలి. రింగ్ రోడ్ల చుట్టూ టౌన్ షిప్ లను , ఇన్ఫ్రాస్ట్రక్చర్ ను , విద్య వైద్యం ఉపాధి సంస్థలను నెలకొల్పాలి.
23. రాష్ట్ర ఆదాయం పెంచడానికి, విదేశీ పెట్టుబడులను, విదేశీ ఉపాధి సంస్థలను రప్పించాలి. టూరిజంను అభివృద్ధి చేయాలి.
24. సామాన్యులకు ఓటు హక్కు కావాలని కృషి చేసిన డా. అంబేడ్కర్ గారి కృషికి ఫలితం దక్కాలంటే, ఓటుకు విలువను పెంచాలంటే, ప్రతి ఒక్కరు ఓటు వేయడానికి ఆసక్తి చూపాలంటే, ఓటరు ఆత్మాభిమానం దెబ్బ తీయకుండా ఉండాలంటే,  "పార్టీ పిరాయింపుల నివారణ చట్టాన్ని" మరియు " అవినీతికి పాల్పడే, హామీలను అమలు చేయని అభ్యర్థుల కాల్ బ్యాక్ చట్టాన్ని" తీసుకుని రావాలి.

Monday, December 4, 2023

పార్టీ పిరాయింపుల చట్టాన్ని తీసుకుని రావాలి

భారతీయులమైన మనం స్వేచ్ఛగా, స్వతంత్రంగా జీవించాలని నాటి స్వాతంత్ర సమరయోధులు ఝాన్సీ లక్ష్మీబాయి, అల్లూరి సీతారామరాజు, రాణీ రుద్రమదేవి, గాంధీజీ, నెహ్రూ, నేతాజీ సుభాష్ చంద్రబోస్, సర్ధార్ వల్లభాయ్ పటేల్ , డా.బాబా సాహెబ్ అంబేద్కర్, భగత్ సింగ్ మరెందరో త్యాగాల ద్వారా, బ్రిటిష్ లేను తరిమి కొట్టి , స్వాతంత్ర్యం సాధించి సుమారుగా ఏడు దశాబ్దాలు గడిచినా ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లు అయిపోయింది. ప్రజాస్వామ్యంగా ప్రజలు జీవించాలని రాజ్యాంగాన్ని రచించిన డా. అంబేడ్కర్ గారు , 18 యేండ్లు నిండిన ప్రతి ఒక్కరికి  వారికి ఓటు హక్కును కల్పించారు. పూర్వ కాలంలో  ఈ ఓటు  హక్కు కేవలం  ధనవంతులకు , విద్యావంతులకే   ఉండేది .  కానీ, ఈ రోజు అప్రజాస్వామికంగా ఎన్నికలు జరుగుచున్నవి. పలుగు ఉన్న వారిదే బర్రె అన్నట్లు, బుజ బలం , కండ బలం ఉన్న వారిదే, ధనం ఉన్న వారిదే గెలుపు,వారసులదే అధికారం అన్నట్లుగా ఉంది. రాజకీయాల్లోకి యువత ధైర్యంగా రావాలి. కానీ , రాజకీయ వ్యాపారం చేయడానికి చేయకూడదు. ఎన్నికల విధానంలో అనేక లోపాలు ఉన్నాయి. ఎన్నికల వ్యవస్థలో లోపాలు గురించి నేను " ఎన్నికల సంస్కరణల దిక్సూచి" అనే పుస్తకాన్ని రచించాను. ఆసక్తి గలవారు స్టడీ చేయ గలరు. నా బ్లాగ్ #www. sollutions2all.blogspot.com ను చూడ గలరు. ఎన్నికల సంస్కరణలు చేయకుండా, వెయ్యేండ్లు ఎన్నికలు జరిగినా, లక్షల కోట్లు వృధానే తప్పా ప్రయోజనం ఉండదు. నేటికీ రాష్ట్రాలలో, దేశంలో , పేదరికం తగ్గక పోవడం , అవినీతి పెచ్చు పెరగడం, నియంతృత్వ పాలనలు, ప్రశ్నించే స్వేచ్ఛ లేక పోవడం, దేశ సంపదను సమానంగా అనుభవించనివ్వక పోవడం , ఉపాధి కల్పన వికేంద్రీకరించక పోవడం , నిరుద్యోగుల సంఖ్య పెరగడం, పేద తనం తగ్గక పోవడం, గ్రామాల ప్రజలు కొందరు త్రాగుడుకు బానీసలవడం కారణంగా, నేటికీ ప్రజలు , చకోర పక్షుల్లా, ఉచితాల కొరకు, ఉచిత పథకాల కొరకు ఎదురు చూస్తున్నారు. ఓటర్లకు డబ్బు ఆశ, మధ్యం ఆశ, బిర్యాని ఆశ చూపుతూ, అభ్యర్ధులు ఓటర్లను కొంటున్నారు. ఇది జగమెరిగిన సత్యం. ఎక్కడా నియంత్రణ లేదు. ఎన్నికల సమయంలో పట్టుబడ్డ డబ్బును, ఆయా గ్రామాల అభివృద్ధికి ఖర్చు చేయాలి. నేడు అలాకూడా చేయడం లేదు. గత ఏడు దశాబ్దాల నుండి అనేక మార్లు ఎన్నికలు జరిగాయి. ఎన్నికలు జరిగిన ప్రతిసారీ ఓటర్లే ఓడి పోతున్నారు తప్పా అభివృద్ధి చెందడం లేదు. పైగా ఉచితాలకు అలవాటుపడి సోమరులు అవుతున్నారు, బానీసలుగా మారిపోతున్నారు. 
అందుకు ముఖ్యమైన కారణాలను పరిశీలిస్తే, 
 01. భారతీయులై యుండి, 25 సం.రాలు నిండి, మానసికంగా బాగా ఉంటే చాలు, పోటీ చేయడానికి అవకాశం ఉండటం 

 02. విద్య లేక పోయినా, ఎన్ని కేసులు ఉన్నా, ఎంతటి అవినీతికి పాల్పడినా , పోటీ చేయడానికి అర్హత కలిగి ఉండటం 

03. వారసత్వాలకే అధిక అవకాశాలు ఉండటం 

04. చనిపోయిన అభ్యర్థుల వారసులకు, అర్హత లేక పోయినా పోటీ చేయడానికి అవకాశాలు కల్పించడం 
 
05. ఎన్నికలలో చేసే ఖర్చుపై నియంత్రణ లేకపోవడం , ఇలా మరెన్నో.. 

06. యువతీ యువకులు రాజకీయాల్లోకి రావడానికి ప్రోత్సాహం లేక పోవడం 

07. డెబ్భై యేండ్లు నిండిన వృద్ధులు కూడా , రాజకీయాల్లో పోటీ చేయడానికి అవకాశాలు ఉండటం

ఇప్పుడు ప్రజలు ముఖ్యంగా కోరుకునేది, పార్టీలు ఏవైనా కానీ, అవి కాంగ్రెస్, బిఎస్పీ, బిజేపి,ఎం.ఐ.ఎమ్ , బి.ఎస్.పి. మరియు ఇతర పార్టీలు ఏవైనా కావచ్చు. ప్రజాస్వామ్య దేశంలో, ప్రజలే గెలవాలంటే, ప్రజాభిప్రాయాలను , ప్రజల ఆశయాలను వమ్ము చేయకుండా ఉండాలంటే, ప్రజల ఆకాంక్షలు నెరవేరాలంటే, తక్షణమే ఈ చర్యలు చేపట్టాలి. 

 01. అభ్యర్థుల "పిరాయింపుల నివారణ " చట్టాన్ని తీసుకుని రావాలి 

 02. ప్రజాభిప్రాయాలకు వ్యతిరేకంగా, ప్రజల విశ్వాసాలకు వ్యతిరేకంగా పాల్పడే అభ్యర్థులను " కాల్ బ్యాక్ " చేసే చట్టాన్ని తీసుకుని రావాలి. 
 
03. అప్పటి వరకు గెలిచిన ఎమ్మెల్యే లు, ఎమ్మెల్సీలు, ఎంపీలు , ఓటర్ల అభిప్రాయాలను, ఆకాంక్షలను, ఆశలను వమ్ము చేయకుండా, నైతిక భాద్యత వహించి, ఇతర పార్టీల లోకి పిరాయించకుండా ఉండాలి. ఒక వేళ ఇతర పార్టీల లోకి వెళ్ళాలనుకుంటే, గెలిచిన పదవికి, పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేసి, ఓటర్ల అభిప్రాయాలకు , ఓటు వేయడానికి విలువైన సమయం వెచ్చించి నందుకు, నష్ట పరిహారం కట్టించి, వేరే పార్టీలోకి వెళ్ళాలి. ఇది స్వతంత్ర అభ్యర్ధులకు కూడా వర్తిస్తుంది. 

 04. ఓటర్ల ఓటు హక్కును దుర్వినియోగ పరిచే విధంగా, అగౌరవ పరిచే విధంగా, ఓటర్ల నమ్మకాన్ని చెదరగొట్టే విధంగా, ఓటర్లు 3 గంటలు క్యూలైన్లలో నిలబడి, ఓట్లు వేసి గెలిపించిన ఎమ్మెల్యే లపై అనర్హత వేటు వేయకుండా, అబ్సల్యూట్ పవర్స్ ను స్పీకర్లకు తొలగించాలి. 

 05. పార్టీ పిరాయించడానికి , మా ప్రాంతాల అభివృద్ధి కొరకు అని సాకు చూపెడుతున్నారు. కాబట్టి, ఏ ప్రభుత్వం వచ్చినా అభివృద్ధికి నోచుకోని అన్ని గ్రామాలను, మండలాలను, జిల్లాలను సమానంగా అభివృద్ధి చేయాలి. ఎన్నికల వరకే పార్టీలు, అభ్యర్థులు మరియు ఓటర్లు. ఆ తరువాత అందరూ రాష్ట్ర ప్రజలు, దేశ ప్రజలే అని భావించాలి. 
 
06. ఇతర పార్టీల లోకి వెళ్ళే ఎమ్మెల్యేలను , ఎంపీలను, ఆయా నేతల గెలుపు కొరకు కష్ట పడిన కార్యకర్తలు, ఓట్లు వేసిన ఓటర్లు సామదాన భేదోపాయాలతో పార్టీ పిరాయించకుండా చూడాలి. 
 
07. బిల్లులు పాస్ చేసే సమయాలలో, అవి ప్రజోపయోగకరమైనవి అయినట్లయితే, బయట నుండి సపోర్ట్ చేయవచ్చు. 

 08. ప్రభుత్వాలు ఇచ్చిన హామీలను, అవినీతిని, మోసాలను, భూకబ్జాలను ప్రశ్నించడానికి, వ్యక్తులుగా కాకుండా, "ప్రజా మేధావుల సంఘాలను" ఏర్పాటు చేయాలి.అలానే పిరాయించే నేతలను వీరు గట్టిగా అడ్డుకోవాలి

Friday, December 1, 2023

బర్రెలక్క కొరకు దేశ విదేశాల మేధావుల స్పందనకు కారణాలేమిటి?

బర్రెలక్క/ Barrelakka దేశ విదేశాలలోని మానవతా వాదులు, మేధావులు , లాయర్లు, నెటిజన్లు బర్రెలక్క (శిరీష) లో ఏమి చూసి, ఎందుకు ఇంత భారీగా స్పందిస్తున్నారనేది , ఒక సారి పరిశీలిస్తే, ఆమే కులం చూసి కాదు. ఆమే మతం చూసి కాదు. ఆమే ఆడ పిల్ల అని కాదు. ఆమే పేద రాలు , డబ్బు లేదు ఇల్లు లేదు అని కాదు. ఆమే చిన్న వయసు అని కాదు. ఆమే చదువు కున్నదని కాదు. ఆమెకు ఉద్యోగం రాలేదని కాదు.ఇవన్నీ చివరి అంశాలు. బర్రెలక్క లో నెటిజన్లు, మానవతా వాదులు, మేధావులు చూసి స్పందిస్తున్నది ముఖ్యంగా; 01. స్వాతంత్ర్యం వచ్చి ఏడు దశాబ్దాలు దాటినా, దేశంలో నియంతృత్వ పాలనలు, పేదరికం పోకపోవడం. సమానత్వం లేక పోవడం. రాజ్యాంగం, చట్టాలు బలంగా ఉన్నా అవి అమలు కాక పోవడం మొదటి దైతే. 02. బర్రెలక్క ఒక స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయడం 03. బర్రెలక్క లో ధైర్యం, పట్టుదల 04. బర్రెలక్క లో పోరాట పటిమ ఉండటం 05. బర్రెలక్కలో సాధించే శక్తి ఉందని గ్రహించడం 06. బర్రెలక్క లో చురుకు తనం,కలుపుగోలుతనం 07. బర్రెలక్క లో ముక్కుసూటి తనం ,చతురత 08. బర్రెలక్క ప్రతి ప్రశ్నకు వెంటనే సమాధానం చెప్పే మేధా శక్తి ఉండటం. అది కూడా ఒక పేపర్ లేకుండా, ఎవరి సలహాలు, సూచనలు లేకుండా 09. బర్రెలక్క లో అనంతమైన ఏదో ఒక ''సిక్స్ సెన్స్" ఉందని,పేద ప్రజలకు ప్రతినిధి అవుతుందని గ్రహించడం 10. బర్రెలక్కకు దేశం, రాష్ట్రాల ప్రజా సమస్యలపై ప్రాధమిక అవగాహన ఉండటం 11. బర్రెలక్క మాటలలో అబద్దాలు, తడబాటు తనం లేక పోవడం 12. బర్రెలక్క లో కించిత్తు గర్వం కనిపించక పోవడం 13. బర్రెలక్క లో అమాయకత్వం ఉండటం 14. బర్రెలక్క లో ఇతర నిరుద్యోగుల, పేదల సమస్యలు తీర్చాలనే మానవతా దృక్పథం ఉండడం. 15. వ్యవ‌స్థల లోపాలను ఎత్తి చూపాలనే తపన కలిగి ఉండటం. 16. ఇలాగ నిర్భయంగా ఎదిరించే, మాట్లాడే యువతీ యువకులు రాజకీయాల్లోకి రావాలని మేధావులు కోరుకోవడం ఆ తర్వాత నే మొదట "కాదు" అని చెప్పిన అంశాలు వచ్చి చేరినాయి ఈ అంశాలే నెటిజన్లను, మానవతా వాదులను, మేధావులను ఆకట్టుకుంటున్నాయి. ఇలాంటి లక్షణాలు/ అంశాలు ఎవరిలో ఉన్నను మానవతా వాదులు, మేధావులు, ప్రజాస్వామ్య వాదులు, నెటిజన్లు తప్పకుండా స్పందిస్తారు ఇలాంటి యువతీ యువకులను ప్రోత్సహించాల్సిన భాద్యత మనందరిపైనా ఉంది. దేశ సంపదను వికేంద్రీకరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.