Tuesday, December 12, 2023

మహిళలకు తెలంగాణా అంతటా ఉచిత ప్రయాణం (FREE BUS TRAVEL TO WOMEN IN TELANGANA

"ఉచితం" అనేది రెండు వైపుల పదునైన ఆయుధం లాంటిది. ఉచితం పేర్లు ఏవైనా అవి కొందరికి మేలు కలిగిస్తే మరికొందరికి సమస్యలను సృష్టిస్తాయి. ఉచితాల వలన ప్రభుత్వానికి  కొన్ని లాభాలుంటే, కొన్ని నష్టాలు కూడా ఉంటాయి. ఉచితాల వలన కొన్ని రాష్ట్రాలు, దేశాలు అప్పుల పాలై  కుప్ప కూలినవి కూడా ఉన్నాయి.

మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం వలన కలిగే 
 కొన్ని ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం:

01. మహిళలకు ఉచిత ప్రయాణం వలన, ఆర్ధిక భారం తగ్గుతుంది. బస్ పాస్ ల డబ్బు, బస్సు చార్జీలు మిగలడం వలన, పేద మహిళలు వాటిని ఇతర ఖర్చులకు పొదుపుగా వాడుకుంటారు.
02. చిరు ఉద్యోగులకు, విద్యార్థినులకు, అనారోగ్యంతో ఉన్న వారు , అడ్డకూలీలకు, దూర ప్రాంతాల వ్యాపారస్తులకు చాలా మేలు జరుగుతుంది.
03. అనారోగ్యంతో ఉన్న మహిళలు, వారి పిల్లలు , 5 సం.లోపు ఉన్న మగ పిల్లలకు కూడా మెరుగైన వైద్యం కోసం పట్టణాలకు వచ్చే వారికి , ఉచిత బస్సు ప్రయాణం ఎంతో ఊరట నిస్తుంది.
04. పాచి పనులు, నర్సు పనులు, ఇతర సర్వీసులు అందించే వారు, ఇంటి కిరాయీలు తక్కువగా ఉన్న చోట నివసిస్తారు. రవాణా చార్జీల భారం భరించలేక, ఆ చుట్టుపక్కలనే, తక్కువ డబ్బులకు పని చేస్తారు.
ఇప్పుడు వారు ఏ ప్రాంతాలలో డబ్బులు ఎక్కువగా ఇస్తారో అక్కడికి వెళ్ళి ఎక్కువ డబ్బు సంపాదించు కోగలరు
05. రవాణా చార్జీల వలన కొందరు, వారి పనులను వాయిదా వేసుకుంటారు. 4, 5 పనులకు కలిపి ఒకేసారి వెలుతారు. ఇప్పుడు అలా పెండింగ్ పెట్టరు.
06. ఏ మీటింగ్ లు ఉన్నా, మహిళలందరు కలిసి, ఎంత దూరమైనా వెళ్ళి పోతారు.
07. విద్యార్ధినులను, ఉద్యోగ మహిళలను స్కూటర్ల పై , కార్లలో డ్రాప్ చేసే , తల్లిదండ్రులకు, భర్తలకు, ఎంతో డబ్బు, సమయం ఆదా అవుతుంది,
08. స్త్రీలకు ఆర్థిక సాధికారత పెరుగుతుంది. స్వేచ్ఛ, ధైర్యం, కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరుగుతాయి. ప్రయాణాలపై అవగాహన పెరుగుతుంది.
09. మహిళలు, గుళ్ళకు, ఫంక్షన్లకు , విహారాలకు, బంధువుల ఇండ్లకు వెలుతూ ఉండటం వలన ప్రశాంతత లభిస్తుంది.
10. చిన్న చిన్న పనులకు, మగవారు స్కూటర్లపై, కార్లలో వెళ్ళే బదులు, వారి కూతుర్లను, భార్యలను, తల్లులను పంపిస్తారు. దీని వలన ఫ్యామిలీకి అధిక డబ్బు, సమయం ఆదా అవుతుంది.
11. స్త్రీలే అధికంగా వెలుతారు కాబట్టి, బస్సులలో సెక్యూరుడుగా ఫీలవుతారు.
12. దూర ప్రాంతాలని, బస్సు చార్జీల భారం భరించలేక, కొందరు పేద విద్యార్థినిలు, మధ్యలోనే చదువులు మానేస్తున్నారు. అలాంటి వారు ఇప్పుడు చదువుకోడానికి ఆసక్తి చూపుతారు.
13. అంతే కాకుండా రవాణా చార్జీలు భరించలేక కొందరు ఆడ పిల్లలను దగ్గరలోని ఏదో ఒక స్కూల్ లో చదివిస్తున్నారు. ఇప్పుడు వారు ఎంత దూరమైనా మంచి స్కూళ్ళలో చదివించడానికి అవకాశం ఉంది.
14. మరికొందరు పట్టణాలలో, రూములు రెంటుకు తీసుకుని చదవడానికి, ఉద్యోగం చేయడానికి, చాలా డబ్బు ఖర్చు అవుతుంది. రిస్క్ అవుతుంది, సేఫ్టీ ఉండటం లేదు. ఇప్పుడు వారు ఇంటి నుండే పట్టణాలకు వెళ్ళి చదువుకుని లేదా ఉద్యోగం చేసి రాత్రి వరకు ఇంటికి చేరవచ్చు.
15. రవాణా ఖర్చు లేక పోతే అన్ని ప్రాంతాలలో ధరలు తగ్గి పోతాయి.
16. రవాణా చార్జీలు లేక పోవడం వలన, గ్రామీణ ప్రాంతాల మహిళలు, అక్కడ తక్కువ ధరలకు అమ్మే బదులు, పట్టణాలకు వచ్చి ఎక్కువ ధరలకు కూరగాయలు, పండ్లు, పూలు, ఇతర వస్తువులు, మధ్య దళారులు లేకుండా అమ్మకో గలరు.
17. స్త్రీల మూవ్ మెంట్ పెరుగుతుంది. ఇప్పటి వరకు రవాణా చార్జీలు ఉండటం వలన, ఒంటింటి కుందేలు లాగానే ఉండేవారు. ఇప్పుడు అది ఉండదు. అవసరాలు  ఉంటే ఎక్కడికైనా వెలుతారు.
18. పార్లమెంట్ లో పాసైన మహిళా బిల్లు కంటే గొప్పగా , పూర్తి స్వేచ్ఛ లభించినట్లుగా, స్త్రీలు చాలా గొప్పగా ఫీలవుతుంటారు 
19. పర్యాటక రంగం అభివృద్ధి చెందగలదు. దీని వలన ప్రభుత్వానికి పరోక్ష పన్నుల రూపంలో ఆదాయం పెరుగగలదు.

ఇప్పుడు ఇక కొన్ని నష్టాల గురించి తెలుసుకుందాం:
01. మహిళలకు బస్సు చార్జీలు ఉచితమైతే, అది ప్రభుత్వానికి నష్టం. రోజుకి అది సుమారుగా 7 కోట్ల రూపాయలు ఉంటుందని అని ఒక అంచనా
02. బస్సు చార్జీలు ఉచితం కావడం వలన, మెట్రో, ఎంఎం టీఎస్ ట్రేన్లలో ప్యాసెంజర్లు తగ్గిపోతారు. అందువలన వీటికి నష్టం వాటిల్లుతుంది.
03. బస్సులలో ట్రాన్స్ జెండర్స్ కు ఫ్రీ అవకాశం కల్పించారు ‌. వీరిలో ఎవరు నిజమైన ట్రాన్స్ జెండర్సో తెలియదు. బెగ్గింగ్ కొరకు చీరెలు కట్టుకుని ప్రయాణం చేస్తే, మహిళలకు చాలా ఇబ్బంది కరంగా మారవచ్చు.
04. మహిళలందరికీ ఉచిత బస్సు ప్రయాణం కల్పించడం వలన, ధనవంతులు, ఆదాయ పన్నులు కట్టే వారు, కార్లు, బస్సులు ఉన్న వారు కూడా, ఆర్టీసి బస్సులలో ప్రయాణించడం వలన, ప్రభుత్వానికి అధిక భారం పడుతుంది. అలానే బస్సులలో అనవసరంగా రద్దీ పెరుగుతుంది. దీని వలన స్థోమత గల, ఉద్యోగ భాద్యత గల మహిళలకు అన్ కంఫర్ట్ గా ఉంటుంది.
05. మహిళలకు అధిక భారం పెరుగుతుంది. ప్రతి పనికి, పేద మగవారు, మీకు ఉచితం కదా అని, మద్యానికి , మందులకు, బ్యాంకులకు, షాపింగ్ లకు స్త్రీలనే బయటకు పంపిస్తారు. మగవారు చెసే బయటి పనులన్నిటికీ స్త్రీలనే పంపించడానికి ఆలోచిస్తారు.
06. మొదట సరదాగానే ఉంటుంది. కానీ కొంత కాలం తర్వాత వారు చాలా భారంగా ఫీలవుతారు. ఆ తర్వాత బయట స్నేహాలు పెరిగి, ఇతర వ్యాపకాలకు అలవాటు పడవచ్చు.
07. కుటుంబాలలో, ప్రతి రోజూ ఏదో ఒక సమస్య ఉండనే ఉంటుంది. అలాంటి సమస్యలు జరిగినప్పుడు, స్త్రీలు ఇంట్లోనే సర్దుకు పోయే వారు. ఇప్పుడు అలా ఇంటి పట్టున ఉండకుండా, ప్రశాంతత కొరకు అని ఎక్కడికైనా వెళ్ళి పోతారు.
దీని వలన మరిన్ని సమస్యలు రావడానికి అవకాశం ఉంది.
08. బస్సు ప్రయాణం ఉచితమని తిరిగే అలవాటు ఉన్న కొందరు  ప్రక్క స్త్రీలను వెంటేసుకుని తిరగడం వలన ఉన్నతమైన మంచి కుటుంబాలలో, భార్యా భర్తల సంబంధాలు, తల్లిదండ్రులు పిల్లల సంబంధాలు దూరమయ్యే అవకాశాలను కొట్టి పారేయ లేము.
09. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే అవకాశం లేక పోలేదు
10. పని ఉన్నా లేకున్నా బస్సులలో ఉచితం కాబట్టి, మహిళలు ప్రయాణించడం వలన, బస్సులలో మహిళల సంఖ్య పెరిగి, ప్రభుత్వానికి నష్టం వాటిల్లుతుంది.
11. ఉచితం అనగానే రద్దీ, దీనికి తోడు, అన్నీ మరిచి,  బస్సులలో ఆనందంగా ఉంటారు. దొంగలకు అలాంటి అవకాశమే కావాలి. ఆ కారణంగా బస్సులలో దొంగతనాలు జరిగే అవకాశం లేక పోలేదు.
12. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కావడం వలన, ఆటోలకు, వోలా, ఊబర్ లాంటి టాక్సీ లకు నష్టం వాటిల్లే అవకాశం ఉంది. చక్రాలు తిరుగుతేనే వారు ఇ.ఎమ్.ఐలు , పిల్లల ఫీజులు, టాక్స్ లను కట్టగలరు. కుటుంబాలను పోషించుకోగలరు. లేదంటే వారి కుటుంబాలు రోడ్డున పడగలవు.
13. ద్వి చక్ర వాహనాల అమ్మకాలు తగ్గి పోతాయి.
మధ్య దళారులకు నష్టం వాటిల్లుతుంది.
బస్సులు ఉచితం అని ఓ పది మంది మహిళలు కలిసి రెగ్యులర్ గా , గుళ్ళకు, విహార యాత్రలకు తెలంగాణా అంతటా తిరుగు తుంటే, ప్రభుత్వానికి నష్టం వాటిల్లే అవకాశం ఉంది.

మహాలక్ష్మి పథకం ఉచిత బస్సు ప్రయాణం మరింత ప్రయోజనకరంగా మారాలంటే ఏమి చేయాలి?

ఉచితాలకు అలవాటు పడిన ప్రజలు, హామీ ఇచ్చిన హామీలలో ఏ చిన్న మార్పు చేసినా విరుచుకు పడుతారు. వీరికి తోడు ప్రతి పక్షాలు మరియు విమర్శకులు తోడవుతారు. ఇది సహజం. అయినప్పటికీ,
01. ఆదాయ పన్నులు చెల్లించే వారు, కార్లు, బస్సులు ఉన్న, ధనవంతులైన మహిళలు, వారి పిల్లలు, ఉచితం మాకు వద్దు అనే మహిళలు, వారే స్వచ్చందంగా ఉచిత బస్సులలో ప్రయాణించ వీలు లేకుండా, వారికి ఉచిత కార్డులను ఇష్యూ చేయకూడదు. దీని వలన కొంత వరకైనా ఆటో, టాక్సీ డ్రైవర్ లకు మరియు ప్రభుత్వానికి కొంత మేలు జరుగ గలదు.
02. విద్యార్ధినులకు, ఉద్యోగం కొరకు వెళ్ళే మహిళలకు, చిరు ఉద్యోగులకు, పేద మహిళా కూలీలకు, చిరు వ్యాపారస్తులకు, అర్హులైన ట్రాన్స్ జెండర్స్ కు , మాత్రమే ఫ్రీ కార్డులను ఇష్యూ చేయాలి.
03. ముందుగా, ఇప్పటి వరకు బస్ పాస్ లు కలిగిన మహిళలందరికీ, విద్యార్ధినులందరికీ, ఫ్రీ కార్డులను జారీ చేయాలి. ఆ తర్వాత ఇతర మహిళలకు జారీ చేయాలి.
04. ఆఫీస్, స్కూల్ టైమ్ లలో, అవసరమైన రూట్లలో మహిళలకు స్పెషల్ బస్సులను వేయాలి.
బస్సుల సంఖ్యను పెంచాలి, సమయపాలన పాటించాలి
05. ప్రభుత్వ పాఠశాలలో ఫ్రీ అంటే ఎంత మంది పిల్లలు చదువుతున్నారు. అలానే  బస్సులలో ఉచితం అన్నంత మాత్రాన అందరూ బస్సులలో నే వెళ్ళరు . వారి సౌకర్యం, వేగం , సెక్యూరిటీ  , ఇంటి వరకు చేరే విధానం చూసుకుంటారు. వీధుల్లోకి, ఇండ్ల వరకు బస్సులు పోవు . ఆటో , టాక్సీ వారు ఇవన్నీ గమనించి, ప్రయాణికులలో మన్నత పెంచు కుంటే, వారి గిరాకీ ఎక్కడికి పోదు. ధరలు తగ్గించి పోటీ పడాలి. 
06. మెట్రో, ఎంఎం టీఎస్ లకు కూడా, ఎలాంటి నష్టం వాటిల్లదు. దానిలో ప్రయాణించే ధనికులు, వేగం, సేఫ్టీ కోరుకునే వారు వాటిల్లోనే వెలుతారు.
07. గ్రామ ప్రాంతాలకు, పల్లె వెలుగు బస్సులను పెంచాలి
08. ఆర్టీసీకి నష్టం రాకుండా, వారి యొక్క సమస్యలను పరిష్కరిస్తూ, ఆర్టీసి ఆదాయ వనరులను పెంచాలి.
09. ఆర్టీసీకి నెలకోసారి, మహిళలకు సంబంధించిన చార్జీలను చెల్లించాలి
19. ప్రభుత్వానికి నష్టం కలుగకుండా, టూరిజం , పార్కింగ్స్  అభివృద్ధి చేయాలి. దీని వలన ప్రభుత్వానికి పరోక్ష పన్నుల రూపంలో ఆదాయం పెరుగగలదు.
11. నిజాయితీగా అభివృద్ధి పనులు చేపడుతూ, మెల్లగా మెల్లగా ఉచితాలను తగ్గించడానికి ప్రయత్నాలు చేపట్టాలి. ప్రజలలో చైతన్యం తీసుకు రావాలి. ఇది వ్యవస్థలలోనే రావాలి. ఓటు బ్యాంకు కొరకు ఉచితాలను ఇవ్వాలని పోటీ పడుతున్నారు. ఉచితాలకు అలవాటు పడిన ప్రజలు, ఎవరు ఎక్కువ ఉచితాలు ఇస్తే వారికి ఓటు వేస్తున్నారు. లేదంటే ఇంట్లో నుండి కదలడం  లేదు. ఉచితాలను ప్రోత్సహించే వారికి కఠిన శిక్షలు వేసే, ఎన్నికల వ్యవస్థ రావాలి. ఓటర్లకు పంచే డబ్బు, ఏ ప్రాంతంలో పట్టుబడితే, ఆ ప్రాంతంలో అభివృద్ధికే , మొత్తం డబ్బును ఖర్చు చేసే చట్టాలు రావాలి. 

No comments: