Tuesday, June 17, 2025

కుందేలు ఉపాయం (బాలల కథ)

అంశం: బాలల కథల పోటీ

శీర్షిక: కుందేలు ఉపాయం

అనగనగా ఓ కాకి.అది చాలా ఆకతాయి గా ప్రవర్తిస్తుండేది.ఒక సారి ఏనుగు నిదుర పోతుంటే దానితలపై రెట్టలు వేసింది.ఏనుగు లేచి తిరుగుతుంటే సున్నం వేసినట్టు తలంతా తెల్లని మరకలు.

అడవిలో జంతువులు ఒకటేనవ్వు.
ఆ దృశ్యం చూసి కాకి చెట్టుకొమ్మల్లో కూర్చుని కిసుక్కున నవ్వుకొనేది.ఇలా అన్నిటీనీ ఎదోలా ఆట పట్టించేది.దాని బాధ ఆ అడవిలోని మృగరాజుకూ తప్పలేదు.ఎలాగైనా ఈ ఆగడాలు కట్టించాలనుకుంది సింహం..

జంతువులన్నీ ఒక రోజు సమావేశం ఏర్పరచుకున్నాయి. అందులోకి ఆకతాయి కాకిని మినహా , అన్నిటితో సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. అప్పుడు కుందేలుకు ఒక ఆలోచన తట్టింది.

"రాజా! నా దగ్గర ఒక ఉపాయం ఉంది చెప్పమంటారా" అంటుంది కుందేలు, సింహం తోటి. 
"సరే ఏమి పర్వాలేదు , చెప్పు" అని అంటుంది సింహం. 

"ఎలాంటి సమస్యలైనా , కలసి మాట్లాడు కుంటే , ఇట్టే పరిష్కారమవుతాయి అంటారు. అందుకని , కాకికి ప్రీతి కరమైన పక్షి తోనే మాట్లాడించి పరిష్కరించవచ్చు" అని సలహా ఇస్తుంది ,కుందేలు.
సామదానభేద దండోపాయాలు ఎలాగో ఉన్నాయి కదా , "సరే.. అలానే చేద్దాం కానివ్వు" ,  అంటుంది సింహం , ఏనుగు,మిగిలిన జంతువులు కూడా.

ఇప్పుడు కాకికి ఇష్టమైన పక్షి నమ్మకమైన పక్షి , ప్రీతికరమైన పక్షి  ఏదీ...? అని ఆలోచిస్తుండగా , "కోకిల దానికి యిష్టమైన పక్షి" అని కుందేలు చెబుతుంది.

ఈ విషయం "కోకిల" కు చెబుతారు. సరే అని "కోకిల" ఈ సమస్యను తన భుజస్కంధాలపై వేసుకుని , కాకి వద్దకు వెళ్ళి మాట్లాడుతుంది.

"చూడు కాకి , మనమందరం ఒకే జాతి పక్షులం , మూగ జీవులం , అడవి జీవులం.
ఒకరికొకరం సహాకారాలతో బ్రతికే వాళ్ళం. మన జీవిత కాలం కూడా చాలా తక్కువ. మనం పోయేటప్పుడు , అన్నిటినీ ఇక్కడే వదిలి పెట్టి పోతాం. మనకు చివరికి మిగిలేది మనం చేసిన మంచి చెడులు, వ్యక్తిత్వాలే  శాశ్వతంగా నిలిచి పోతాయి. లోకంలో మన గుణాలను బట్టి ఎంతగానో నేటికీ కీర్తించబడుతున్నాం. మన పేర్లను దేశాల రాష్ట్రాల చిహ్నాలుగా పెట్టుకుంటున్నారు.

ఇలా నీవు ఆకతాయిగా ఏనుగులు , సింహాలు ఇతర జంతువులపై రెట్టలు వేయడం సరికాదు , వారు చాలా బాధతో, కోపంతో ఉన్నారు. దీని వలన శతృత్వం కూడా పెరుగుతుంది" , అని వేదాంత ధోరణిలో హిత బోధ చేస్తుంది.

కాకి కూడా కోకిల చెప్పిన  విషయాలనన్నిటిని సావధానంగా విని అర్ధం చేసుకుంటుంది. "నిజమే కదా" అని తన మనసులో అనుకుని, తన తప్పు తెలుసుకుంటుంది. పశ్చాత్తాపం చెందుతుంది. "ఇక నుండి నేను వేటిపైనను ఆకతాయిగా రెట్టలు వేయను" అని మాట యిస్తుంది. తన పొరపాటుకు , క్షమాపణలు చెబుతుంది.

కాకి ఇంత త్వరగా అర్ధం చేసుకున్నందుకు  కోకిల,  కాకికి కృతజ్ఞతలు తెలుపుతుంది.
ఇదే విషయం , కోకిల , కాకిని వెంట తీసుకుని వచ్చి సింహ రాజుకు తెలుపుతుంది. సమస్య సులువుగా పరిష్కారమైనందులకు , అన్నియు చాలా సంతోషిస్తాయి.


*హామీ పత్రం:* ఇది నా స్వీయ రచన దేనికి అనువాదం అనుకరణ కాదు. దీనిని ఏ పత్రికకు, వెబ్ ప్రింట్ మీడియాకు పంప లేదు, ప్రింట్ కాలేదు మరియు పరిశీలనలో లేదు.

No comments: